అంత్యక్రియలకు 10 వేల మంది... కరోనా భయంతో మూడు గ్రామాల్లో లాక్‌డౌన్

  • అసోంలోని నాగావ్ జిల్లాలో ఘటన
  • మతబోధకుడి అంత్యక్రియలకు పోటెత్తిన జనం
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలు
కరోనా భయంతో జనం అల్లాడుతున్న వేళ ఓ మతబోధకుడి అంత్యక్రియలకు ఏకంగా 10 వేల మంది హాజరు కావడం కలకలం రేపింది. విషయం తెలిసి అప్రమత్తమైన ప్రభుత్వం వెంటనే మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ ప్రకటించింది. అసోంలోని నాగావ్ జిల్లాలో జరిగిందీ ఘటన. అఖిల భారత జమైత్‌ ఉలేమా ఉపాధ్యక్షుడు, ఈశాన్య రాష్ట్రాల అమిర్‌–ఇ–షరియత్‌ అయిన ఖైరుల్‌ ఇస్లాం (87) మృతి చెందగా ఈ నెల 2న కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏకంగా పదివేల మందికిపైగా పాల్గొన్నారు. కరోనా కేసులతో భయపడుతున్న వేళ భౌతిక దూరాన్ని గాలికి వదిలేసి వేలాది మంది పాల్గొనడం సంచలనమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇస్లాం కుమారుడు, ఆల్‌ ఇండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ పార్టీకి చెందిన అమీనుల్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మూడు గ్రామాల్లో లాక్‌డౌన్ విధించారు. మరోవైపు, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

Assam
Religious leader
funeral

More Telugu News